- తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు
- పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంపు..?
- కేబినెట్ మీటింగ్లో చర్చించి తుది నిర్ణయం
Telangana varta: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ విషయంలో కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదివారం హైదరాబాద్లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 65 ఏళ్లకు పెంచే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని చెప్పారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును కూడా పెంచుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి
2021లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచింది. 58 ఏళ్ల నుంచి 61 సంవత్సరాలకు పెంచారు. ఈ చర్య వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కోల్పోతామంటూ యవత, నిరుద్యోగులు ఆందోళనలు చేపట్టారు. ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచాలని భావిస్తుండగా.. నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత రాదని భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇప్పటికే 55,000 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయటం, జాబ్ క్యాలెండర్ విడుదల చేసి దాని ప్రకారం మిగిలిన ఖాళీలను భర్తీ చేయాలని యోచిస్తుండటంతో నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత రాదని భావిస్తున్నారు. ఈ మేరకు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుపై మంత్రివర్గ సహచరులతో సంప్రదింపులు జరిపి తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ భావిస్తున్నారట.నిధుల కొరతే కారణమా..?
‘ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ బిల్లులు రూ.8,200 కోట్లకు చేరాయి. మరో ఆరు నుంచి ఎనిమిది నెలల్లో 6,000 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేసే అవకాశం ఉంది. దీంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించేందుకు అదనంగా మరో రూ. 5,000 కోట్లు అవసరమవుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు నెలవారీ రూ.6,500 కోట్ల జీతాలు, పెన్షన్లను సకాలంలో విడుదల చేస్తున్నా.. మెడికల్ రీయింబర్స్మెంట్, ఇతర ఖర్చుల కోసం ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ బిల్లులను క్లియర్ చేయలేకపోతుంది. ఇప్పటికే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్లను అమలు చేయడానికి నిధులను అప్పుగా తీసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు రిటైర్మెంట్ అయితే.. పెండింగ్ బిల్లులు, పదవీ విరమణ ప్రయోజనాలను ఏకమొత్తంలో చెల్లించేందుకు ప్రభుత్వం వద్ద డబ్బు లేదు. పదవీ విరమణ వయస్సును పెంచటం ద్వారా.. ఆయా చెల్లింపులను మూడు నుంచి నాలుగేళ్ల పాటు ఆలస్యం చేయటానికి అవకాశం ఉంటుంది. ‘ అని ఓ ఉద్యోగుల సంఘం నాయకుడు వెల్లడించారు. నిధుల కొరత కారణంగానే రిటైర్మెంట్ పెంపు నిర్ణయానికి మెుగ్గు చూపే ఛాన్స్ ఉందని అంటున్నారు.
2025 క్యాలెండర్ ఇయర్లో దాదాపు 9 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేస్తారని ప్రభుత్వ వర్గాల అంచనా. 2026, 2027, 2028లో ప్రతి ఏడాది 8 వేలకు పైగా రిటైర్ అయ్యే అవకాశం ఉంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ సెటిల్ చేయటానికి అప్పుడు ప్రభుత్వానికి దాదాపు రూ. 20 వేలు కోట్లు అవసరం కావచ్చు. HRA, లీవ్ ఎన్క్యాష్మెంట్, గ్రాట్యుటీ మొదలైన వాటితో సహా పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అందుకు భారీగా నిధులు కావాల్సి ఉండటంతో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచాలని రేవంత్ సర్కార్ భావిస్తోన్నట్లు తెలుస్తోంది.

Leave a comment